దళితులపై దాడులు: గొల్లపల్లి సూర్యారావు

ABN , First Publish Date - 2021-12-27T05:26:20+05:30 IST

దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్‌ దళితులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు.

దళితులపై దాడులు: గొల్లపల్లి సూర్యారావు

 రాజోలు, డిసెంబరు 26: దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్‌ దళితులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు. దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా వెనకేసుకొస్తున్నారన్నారు.  తాటిపాకలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వెంకటనారాయణ అనే దళితుడిపై వైసీపీ కార్యకర్తలు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో అతడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన చెందారు. వెంకటనారాయణ కుటుంబాన్ని పరామర్శించేందుకు  వైసీపీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లలేదన్నారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌పై పిచ్చివాడని ముద్ర వేశారన్నారు.   మద్యంపై ప్రశ్నించిన ఓంప్రతాప్‌ తెల్లారేసరికి శవమై తేలాడన్నారు.  ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో పెళ్లి కావాల్సిన దళిత యువతిపై అత్యాచారం జరిగి ఆరు నెలలు అవుతున్నా నిందితులను పట్టుకోలేదని విమర్శించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన కరుణాకర్‌రెడ్డిని శిక్షించలేదన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగంతో అల్లకల్లోలం సృష్టిస్తామంటే ఏ దళితుడు చూస్తూ ఊరుకోడని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటివరకు దాడికి గురైన ప్రతీ దళిత బాధిత కుటుంబానికి  ప్రభుత్వం రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న వెంకటనారాయణకు వైద్య ఖర్చుల కోసం తక్షణమే ప్రభుత్వం రూ.5 లక్షలు అందించాలని, ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. దళితులపై దాడులు పునరావృతమైతే దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో రాష్ట్రంలో   ఫ్రీడ్‌ మార్చ్‌ నిర్వహించి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి గొల్లపల్లి హెచ్చరించారు.

Updated Date - 2021-12-27T05:26:20+05:30 IST