ప్లీజ్..కొవిడ్ పరీక్షలకు రండి
ABN , First Publish Date - 2021-05-09T05:26:06+05:30 IST
కొవిడ్తో విలవిలలాడుతున్న గొల్లవిల్లిలో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆఖరికి కొవిడ్ టెస్టులకు కూడా బయటకు రావాలంటే జంకుతున్నారు.
ఉప్పలగుప్తం, మే8: కొవిడ్తో విలవిలలాడుతున్న గొల్లవిల్లిలో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆఖరికి కొవిడ్ టెస్టులకు కూడా బయటకు రావాలంటే జంకుతున్నారు. శనివారం స్థానిక హైస్కూల్లో గ్రామస్థుల కోసం అధికారులు ప్రత్యేక కొవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. 500 మందికి మొదటి రోజు పరీక్షలు చేయాలనేది లక్ష్యంగా కాగా 157 మంది మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులోను అయిదుగురు రాలేదు. దీంతో ఎంపీడీవో కె.విజయప్రసాద్, ఈవోపీఆర్డీ జి.శివరామకృష్ణయ్య, వైద్యఆరోగ్య సిబ్బంది ఇళ్ళకు వెళ్ళి పరీక్షలు చేయించుకునేందుకు రమ్మని ప్రజలను అభ్యర్థించారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయంగా ఉందంటూ పలువురు చెప్పడంతో అధికారులు వారికి పదేపదే నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కాగా శనివారం నిర్వహించిన పరీక్షల్లో 43మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఎంపీడీవో ప్రకటించారు.