సర్పవరంలో భారీగా కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST
సర్పవరం జంక్షన్, మే 5: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి సర్పవరంలో గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తూంది. రోజురోజుకు గ్రామస్థులు కరోనా వైరస్ బారిన పడటంతో చాపకింద నీరులా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో మాదిరిగా పండూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో

చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్
ప్రైవేట్ టెస్టులతో సరిపుచ్చుకుంటున్న వైనం
సర్పవరం జంక్షన్, మే 5: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి సర్పవరంలో గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తూంది. రోజురోజుకు గ్రామస్థులు కరోనా వైరస్ బారిన పడటంతో చాపకింద నీరులా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో మాదిరిగా పండూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో టెస్ట్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో వ్యాధి నిర్థారణ కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ టెస్ట్లు చేయించుకుంటున్నారు. దాంతో పాజిటివ్ వచ్చినవారు స్వీయ హోంఐసోలేషన్లో ఉండకుండా యథేచ్ఛగా బయట తిరగడంతో పాజిటివ్ బాధితుల సంఖ్య వేలల్లో నమోదు అవుతున్నాయి.
వేగంగా వ్యాప్తి
కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో సుమారు 16 వేలమంది జనాభా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుత సెకండ్ వేవ్లో కొవిడ్ టెస్ట్లు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం, వలంటీర్లు, ఏఎన్ఎంల సర్వే చేపట్టకపోవడం వంటి కారణాలతో కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకసారి టెస్ట్కు రూ.1500 చెల్లించి ప్రైవేట్గా కొవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. పాజిటివ్ వచ్చినవారు వివరాలు వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం తెలియకపోవడంతో వైరస్ కేసుల సమాచారం తెలియడం లేదు. పాజిటివ్ వచ్చిన వారు ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్గా మెడికల్ షాపుల్లో మెడిషన్స్ కొనుగోలు చేసి, ఇంట్లో హోంఐసోలేషన్లో ఉండకుండా బయట సంచరించడంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సర్పవరంలో సుమారు 1000 కిపైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఒక్కోక్కరు రెండుసార్లు టెస్ట్ల కోసం రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తూందని, కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా గ్రామస్థుల సౌకర్యార్థం స్థానికంగా కొవిడ్ టెస్ట్లు నిర్వహించాలని కలెక్టర్ను కోరుతున్నారు.
ప్రత్యేక శానిటేషన్
గ్రామంలో కొవిడ్ నిబంధనలు ప్రజలకు తెలియజేస్తూ, కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్ శీలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శానిటేషన్ చేపట్టారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ బ్లీచింగ్, హోపోక్లోరైడ్ ద్రావణాన్ని పారిశుధ్య కార్మికులతో పిచికారి చేయించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆగుగురు వార్డు సభ్యులతో కమి టీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కమిటీ పంచాయతీ కార్యదర్శి బి.శ్రీనివాస్, సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల లావణ్య, పుల్ల వెంకటశేషారావు, కె.దుర్గాసురేష్, వి.గోవిందు, వి.పోతురాజు పాల్గొన్నారు.