టిప్పర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2021-03-15T05:20:23+05:30 IST
ఏలేశ్వరం-యర్రవరం ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న జంగిడి సూరిబాబు (39) మృతి చెందారు.
![టిప్పర్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021031411484343/03142021235001n63.jpg)
ఏలేశ్వరం, మార్చి 14: ఏలేశ్వరం-యర్రవరం ప్రధాన ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న జంగిడి సూరిబాబు (39) మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ రాంబాబు, ఎస్ఐ సంపత్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్స్టేషన్లో విధులు పూర్తి చేసుకుని సూరిబాబు మోటారుబైక్పై కాకినాడ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన తిరుమాలి గ్రామంలోని షిరిడీసాయి వేబ్రిడ్జి వద్దకు వచ్చేసరికి సమీపంలో గల స్టోన్క్రషర్ నుంచి రోడ్డుపైకి వస్తున్న టిప్పర్ మోటారుబైక్ను ఢీకొట్టింది. దీంతో ఆయనకు తలపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్ఐ సంపత్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూరిబాబు స్వగ్రామం విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని జల్లుపల్లి గ్రామంగా గుర్తించారు. సూరిబాబు మృతికి సంబంధించిన సమాచారాన్ని కాకినాడ బెటాలియన్ అధికారులకు అందజేశారు.