స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-10-20T07:09:08+05:30 IST
పరిసరాల పరిశుభ్రతను నిత్య జీవనశైలిగా మార్చుకుని ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ ‘జగనన్న స్వచ్ఛ సంకల్ప దీక్ష’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.
- ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ను ప్రారంభించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
- జిల్లాలో 100 రోజులు నిర్వహణ
- చెత్త సేకరణకు జిల్లాకు 100 హైడ్రాలిక్ పవర్ ఆటోల కేటాయింపు
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 19: పరిసరాల పరిశుభ్రతను నిత్య జీవనశైలిగా మార్చుకుని ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ ‘జగనన్న స్వచ్ఛ సంకల్ప దీక్ష’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కాకినాడ జడ్పీ సెంటర్లో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం-క్లీన్ ఆంధ్రప్రదేశ్’ను మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత ఆవిష్కరించారు. ‘క్లాప్’ లోగోని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్ పవర్ ఆటోలను గ్రామ పంచాయితీలకు అందజేస్తామన్నారు. ప్రజా భాగస్వామ్యంతో యాంత్రికంగా ఇంటింటి నుంచి సేకరణ, వ్యర్థాల శుద్ధి, ప్రతీ ఇంటిలో కంపోస్టు ఎరువులు తయారు చేసేలా చేయడమే స్వచ్ఛ సంకల్పం ప్రధాన ఉద్దేశమన్నారు. జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘క్లాప్’ ద్వారా సుమారు రూ.11.20 కోట్ల వ్యయంతో 155 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. వీటిలో అమలాపురం డివిజన్కు 39, రాజమహేంద్రవరం, రామచంద్రపురం డివిజన్లకు 49, పెద్దాపురం డివిజన్కు 31, కాకినాడ డివిజన్కు 35, రంపచోడవరం డివిజన్కు-1 చొప్పున వాహనాలు పంపారన్నారు. ఇవి ఆయాచోట్లకు చేరుకుని బుధవారం నుంచి చెత్త సేకరిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ, పి.గన్నవరం ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.లక్ష్మీశ, (రెవెన్యూ), కీర్తి చేకూరి (అభివృద్ధి), జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, జిల్లా పంచాయితీ అధికారి ఎస్వీ నాగేశ్వర నాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ రూరల్, కరప జడ్పీటీసీలు, ‘కుడా’ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు.