జైలు అధికారి బదిలీ వెనుక కుట్ర
ABN , First Publish Date - 2021-08-04T05:34:03+05:30 IST
రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజా రావు బదిలీ వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.
మాజీ మంత్రి జవహర్
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 3: రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజా రావు బదిలీ వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి దేవినేనిని కలి సేందుకు మంగళవారం జవహర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణు గోపాలరాయుడు వెళ్లారు. అయితే కరోనా నిబంధనలను చూపి ములాఖత్కు జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో వారంతా జైలు బయట గేటు వద్ద నిరసన చేస్తూ విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం జగన్ జైలు, హత్యా రాజకీయాలను మళ్లీ మొదలెట్టారని విమర్శించారు. జైలులో దేవినేని ఉమా మహేశ్వరరావు ఎలా ఉన్నారో సమాచారం లేదని ఆయన పరిస్థితిని స్వయంగా చూసేందుకు వచ్చిన తమను కొవిడ్ నిబంధనల పేరుతో అనుమతించడం లేదన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే తమకు అనుమానం వస్తోందని, అసలు దేవినేని క్షేమంగానే ఉన్నారో? లేదో అర్థం కావడం లేదన్నారు. జైలులోనే మొద్దు శ్రీను, మరికొందరు చనిపోయారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేవినేనికి ప్రాణహాని ఉందన్నారు. ప్రత్యర్థులను తుద ముట్టించేందుకు కరోనాను జగన్ ఆయుధంగా చేసుకున్నారని ధ్వజమెత్తారని అన్నారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవినేనిని అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. చేసిన తప్పులను కరోనాతో కప్పిపుచ్చుతున్నారని యర్రా వేణు విమర్శించారు.టీడీపీ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, కార్యదర్శులు కడితి జోగారావు, మహబూబ్ఖాన్, మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కార్యదర్శి బుట్టా దేవకృప, మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి విజయశేఖర్, నాయకులు రవి యాదవ్, యిన్నమూరి దీపు తదితరులు పాల్గొన్నారు.