గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
ABN , First Publish Date - 2021-11-09T05:48:51+05:30 IST
అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు.
![గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 8: అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలో ఆపరేషన్ పరివర్తన పేరుతో 35 ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. సోమవారం నగరంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వన్టౌన్ పరిధిలో పార్శిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. పార్శిల్ బుక్ చేసుకున్న వ్యక్తుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ పార్శిల్ సర్వీస్ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు కచ్చితంగా వుండాలని ఆదేశించారు. గంజాయి, నల్లమందు, పేలుడు పదార్థాలు ఇతర నిషేధిత వస్తువులు రవాణా చేయకూడదని, బుక్ చేసుకున్న ప్రతీ పార్శిల్ తనిఖీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే ఈస్ట్జోన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్ పర్యవేక్షణలో ప్రకాష్నగర్ సీఐ ఆర్ఏ రవికుమార్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు. స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పార్శిల్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్తో ఆర్టీసీ కాంప్లెక్స్ పార్శిల్ సర్వీస్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన చోట్ల సీసీ కెమెరాలు, రికార్డులు తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు.