గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2021-12-31T06:13:53+05:30 IST
గంజాయి అక్రమ రవాణాపై జిల్లా అంతటా ఉక్కుపాదం మోపినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు చెప్పారు.

- జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు
- ఏజెన్సీలో పలు పోలీసుస్టేషన్ల తనిఖీ
వై.రామవరం, డిసెంబరు 30: గంజాయి అక్రమ రవాణాపై జిల్లా అంతటా ఉక్కుపాదం మోపినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతం వై.రామవరం పోలీస్స్టేషన్ను గురువారం సాయంత్రం తనిఖీ చేశా రు. ఎస్పీగా తొలిసారి ఆయన ఇక్కడకు విచ్చేశారు. గిరిజన గ్రామాల్లో క్రైమ్రేటు వివరాలపై ఆరా తీశారు. అసాంఘిక చట్టవ్యతిరేక కార్యకలాపాలవైపు వెళ్లకుండా గిరిజనుల్లో చైతన్యం తేవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఆనుకొని ఉన్న ఏజెన్సీలోని పోలీస్స్టేషన్లలో పోలీస్లు అప్రమత్తపు చర్యలు పాటించాలన్నారు. సంక్రాంతికి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి సీఆర్పీఎఫ్ పోలీసుల విభాగం నూతనంగా నిర్మాణంలో ఉన్న పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ వెంట రంపచోడవరం ఏఎస్పీలు కృష్ణకాంత్ పటేల్, కె.కుమార్(అడ్మిన్), సత్యనారాయణ(ఏఆర్), అడ్డతీగల సీఐ రవికుమార్, ఎస్ఐ పృధ్వి ఉన్నారు.