పసలపూడిలో పసికందు అపహరణ
ABN , First Publish Date - 2021-12-05T05:18:17+05:30 IST
పసలపూడిలో నిద్రపోతున్న ఆరునెలల పసికందును అపహరించి ఆటోలో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
రాయవరం, డిసెంబరు 4: పసలపూడిలో నిద్రపోతున్న ఆరునెలల పసికందును అపహరించి ఆటోలో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాయవరం ఎస్ఐ పీవీవీఎస్ఎన్ సురేష్ శనివారం వివరాలు అందించారు. పసలపూడి శివారు ఓంశాంతి ఆశ్రమం సమీపంలో కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన పవార్ జానకి కుటుంబం గుడారాలు వేసుకుని భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 2న గుడారంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి పసికందును అపహరించుకుపోతుండగా భోజనం చేస్తున్న జానకి కేకలు వేసింది. దుండగులు ఆటోలో రామచంద్రపురం బైపాస్ రోడ్డులోకి వెళ్లిపోవడంతో స్థానికులు ఆటోను వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బాధితురాలు రాయవరం పోలీసులను ఆశ్రయించింది. జిల్లా ఎస్పీ ఆదేశాలపై రామచంద్రపురం డీఎస్పీ పర్యవేక్షణలో రెండు బృందాలు పసికందుకోసం గాలించాయి. రామచంద్రపురం శివారు ప్రాంతంలో ఆటోను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో రామచంద్రపురం పట్టణానికి చెందిన గంపల విజయశేఖర్ అలియాస్ పండు, ముత్యాల భవాని ప్రసాద్, శెట్టి వెంకటేష్ను అదుపులోకి తీసుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పసికందును తల్లికి అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.