అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
ABN , First Publish Date - 2021-10-20T05:24:25+05:30 IST
అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
పెనుమూరు, అక్టోబరు19: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేంద్ర తెలిపిన వివరాల మేరకు... ఈనెల 11వ తేదీన ఓ వ్యక్తి విజయనగరం ఎస్టీ కాలనీకి చెందిన శివాజీ దగ్గరకు వచ్చి గది అద్దెకు కావాలని అడిగాడు. తన పేరు రామ్దూత్ (22) అని, ఆర్వీఎస్ కాలేజీలో పని ఉండగా బీహార్ నుంచి వచ్చానని చెప్పాడు. చదువుకోవడానికి వచ్చాడేమేనని నమ్మి నెలకు రూ.1000 చొప్పున గదిని అద్దెకు ఇచ్చాడు. అయితే మంగళవారం రాత్రి ఆ గది నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానమొచ్చి శివాజీ మరికొంతమందితో వెళ్లి తలుపులు తీయగా ఓ యువతి మృతదేహం కనిపించడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి వివరాల కోసం ఆరా తీశారు. వివరాలు లభ్యంకాకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ తెలిపారు. ఆమెకు సుమారు 20 సంవత్సరాలు ఉండొచ్చని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు చెప్పారు.