రాజధానిలేని రాష్ట్రం అవుతుందేమో: అమర్
ABN , First Publish Date - 2021-12-07T06:42:41+05:30 IST
రాజధానిలేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలేలా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు.
రేణిగుంట, డిసెంబరు 6: రాజధానిలేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలేలా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. స్థానిక వై-కన్వెన్షన్ హాలులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతి సాధన లక్ష్యంగా అక్కడి రైతులు చేపట్టిన పాదయాత్ర మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రవేశించనుందని అన్నారు. పదిరోజులు సాగే కార్యక్రమం నిర్దేశిత ప్రణాళిక మేరకు జరుగుతుందని వెల్లడించారు. జిల్లా రైతులు కూడా యాత్రకు సంఘీభావం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మహా పాదయాత్ర ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదనీ, ఇప్పటికే బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు మద్దతిచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సుగుణ, హేమలత, టీడీపీ నేతలు పులివర్తినాని, నరసింహ యాదవ్, బొజ్జల సుధీర్రెడ్డి, గాలి భానుప్రకాష్, చిట్టిబాబు, శ్రీధర్వర్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.