కరోనాతో ఉదయం భార్య.. సాయంత్రం భర్త మృతి
ABN , First Publish Date - 2021-05-06T16:55:31+05:30 IST
మరణంలోనూ... వీడని బంధం..
- మరణంలోనూ... వీడని బంధం
- కరోనాతో దంపతుల మృతి
చిత్తూరు/మదనపల్లె రూరల్ : కరోనాతో దంపతులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పెద్దమండ్యం మండలం కురవ పల్లెకు చెందిన కె.నారాయణ(65), కె.పాపులమ్మ(60) దంపతులు 20 ఏళ్లకిందట మదనపల్లెకు వలస వచ్చారు. పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో స్థిరనివాసం ఏర్పరచుకుని వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. కాగా పాపులమ్మ పదిరోజుల కిందట అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబీకులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో కోలుకున్న ఆమె ఇటీవల ఇంటికి చేరుకుంది. కాగా.. నారాయణ సోమవారం కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం పాపులమ్మ మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామం పెద్దమండ్యం కురవపల్లెకు తరలించారు. అక్కడ అంత్యక్రియలు ముగించుకుని తిరిగి మదనపల్లెకు చేరుకున్నారు. సాయంత్రం నారాయణ మృతి చెందాడు. ఒకేరోజు తల్లిదండ్రులు మృత్యువాతపడడంతో కుమారులు విషాదంలో మునిగిపోయారు.