మౌనం వరకేనా?

ABN , First Publish Date - 2021-08-25T06:41:52+05:30 IST

తిరుపతి నగరంలోని మున్సిపల్‌, రెవెన్యూ భూముల ఆక్రమణలు కార్పొరేటర్లు చేసినా, వైసీపీ సానుభూతి పరులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈమేరకు కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు కూడా నేను సిద్ధం.

మౌనం వరకేనా?

‘చెన్నాయగుంట చెర’పై నోరు మెదపని అధికార, ప్రతిపక్షాలు 

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం


తిరుపతి, ఆంధ్రజ్యోతి

తిరుపతి నగరంలోని మున్సిపల్‌, రెవెన్యూ భూముల ఆక్రమణలు కార్పొరేటర్లు చేసినా, వైసీపీ సానుభూతి పరులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈమేరకు కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు కూడా నేను సిద్ధం. 

- గత నెల 22న జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పిన మాటలివి. 

ఎక్స్‌అఫిషియో హోదాలో పాల్గొన్న భూమన  నగరంలోని భూములు కబ్జాకు గురికాకుండా అందులో సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, ప్రజాప్రయోజనాల సముదాయాలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగానే కార్పొరేషన్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణకు గురవుతున్న మున్సిపల్‌ స్థలాలను గుర్తించి కమిషనరు గిరీష ప్రత్యేక చొరవ తీసుకోవడంతో యుద్ధప్రాతిపదికన నాలుగు చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడవరకు బాగానే ఉంది. అదేచొరవ రెవెన్యూ అధికారుల్లో లోపిస్తున్నట్టు కనిపిస్తోంది. అర్బన్‌ పరిధిలో రూ.కోట్ల విలువైన చెన్నాయగుంట భూమి కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ యంత్రాంగం.. అధికార, ప్రతిపక్షాల నేతలు మౌనం దాల్చడం గమనార్హం. 

తిరుపతి అర్బన్‌లో రూ.వంద కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవడంపై ‘చెన్నాయగుంటను చెరపట్టారు’ శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కలకలం రేపింది. అధికార, అనధికార వర్గాలతో పాటు క్షేత్రస్థాయిలోనూ చర్చనీయాంశమైంది. అక్కడ స్థలాలు కొనుగోలు చేసినవారు కథనంపై ఆరా తీయడాలు.. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దుకావడాలు.. వంటివి జరిగినట్టు తెలుస్తోంది. ఈ స్థలంలో పాగా వేసినవారు అడ్డంకులు తొలగించే వ్యూహాలను రచిస్తున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు మంగళవారం తిరుపతికి చేరుకున్నట్టు తెలిసింది. వివాదాస్పదమైన ఆ స్థలం గురించి స్థానికంగా పలువురితో మాట్లాడినట్లు సమాచారం. ఇక, 173/3 సర్వే ననెంబరులో పవిత్రమైన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోను అడ్డుపెట్టుకుని షెడ్లను నిర్మించినవారు అధికార పార్టీ నాయకులను కలిసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసి మూడేసి సెంట్ల స్థలాల్లో షెడ్లు వేసేసి అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు తిరుపతిలోని అధికార, విపక్ష నాయకులూ భూకబ్జాపై మౌనంగా ఉన్నారు. తిలాపాపం తలా పిడికిడి అన్నట్టు విపక్షాల్లోని కొందరి అనుచరులు చెన్నాయగుంట 173/3 సర్వే నెంబరులో 2.5 ఎకరాల్లో గతంలో ఇళ్లు నిర్మించుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 

173/4 సర్వేనెంబరులోని 6.7 ఎకరాల్లో దాదాపు రెండు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిందని..  ప్రభుత్వానికి, తమకు హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నకారణంగా మిగిలిన స్థలాన్ని పరిరక్షించుకునేందుకే ప్రహరీ నిర్మించినట్టు ఈ భూమి తమదేనని చెబుతున్నవారి వాదన. అదే నిజమైతే సదరు స్థలంలో అంతర్గత రోడ్లు ఎందుకు వేశారనేది అంతుపట్టని ప్రశ్న. హైకోర్టు తీర్పు రాకముందే విక్రయాలకు తెరలేపడం వివాదాస్పదమవుతోంది.  

Updated Date - 2021-08-25T06:41:52+05:30 IST