బర్డ్లో స్వచ్ఛందసేవకు అనూహ్య స్పందన
ABN , First Publish Date - 2021-07-24T06:37:36+05:30 IST
బర్డ్ ఆసుపత్రిలో విజిటింగ్ కన్సల్టెంట్ల స్వచ్ఛంద వైద్యసేవకు పలువురు వైద్యులు ఆసక్తి చూపారు.

తిరుపతి, జులై 23 (ఆంఽధ్రజ్యోతి): బర్డ్ ఆసుపత్రిలో విజిటింగ్ కన్సల్టెంట్ల స్వచ్ఛంద వైద్యసేవ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మొదలవుతుందని ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ పిలుపునకు దేశంలోని ప్రముఖ వైద్యశాలలకు చెందిన 90 మంది వైద్యులు స్పందించి దరఖాస్తులు పంపినట్టు తెలిపారు. వీరిలో డాక్టర్లు కృష్ణయ్య(హైదరాబాద్), కృష్ణ కిరణ్(ఢిల్లీ), హేమంత్(బెంగళూరు) ఓపీలతో పాటు కీలక సర్జరీలు చేయనున్నారు.సునీల్ అన్సన్నీ(ఛండీఘడ్), ఐవీ రెడ్డి, బాల వర్ధన రెడ్డి , సాయి లక్ష్మణ్, చంద్రశేఖర్, వికాస్రెడ్డి, వినయ్ కిశోర్ (హైదరాబాద్) కూడా సేవలందిస్తామని ముందుకొచ్చినట్టు చెప్పారు. చేతుల శస్త్రచికిత్స నిపుణులు సునీల్, మధుసూదనరావు, (హైదరాబాద్), భాస్కర్ ఆనందకుమార్(మణిపాల్), వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు సూర్యప్రకాశ్(హైదరాబాద్)ను ఎంపిక చేశారన్నారు. వీరితో పాటు ఢిల్లీ ఎయిమ్స్ హెచ్వోడీ డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా బర్డ్లో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు. వీరికి తిరుమల, తిరుపతిల్లో వసతి, డాక్టర్తో పాటు భార్య, పిల్లలకు శ్రీవారి బ్రేక్ దర్శనం, ఉచిత రవాణా వసతి టీటీడీ కల్పించనుంది.