ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులను కట్టడి చేయండి
ABN , First Publish Date - 2021-04-26T04:33:52+05:30 IST
‘ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీన్ని కట్టడి చేయడానికి జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి’ అని అధికారులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తిరుపతి(రవాణా), ఏప్రిల్ 25: ‘ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీన్ని కట్టడి చేయడానికి జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి’ అని అధికారులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలను ఏ రోజుకారోజు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్విమ్స్, రుయాలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లతోపాటు అదనంగా ఒక్కో ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచడంతో పాటు తరచూ తనిఖీలు చేయాలన్నారు. టోల్ఫ్రీ నెంబరును అందుబాటులోకి తేవాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులను బ్లాక్లిస్టులో పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ల వికేంద్రీకరణ, గంగజాతరలు, రంజాన్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ హరినారాయణన్ వివరించారు. ఈ సమీక్షలో ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కమిషనర్ గిరీష, అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రిషాంత్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ అభిషేక్కుమార్, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, రుయా సూపరింటెం డెంట్ భారతి, డీఎంహెచ్వో పెంచలయ్య, డీసీహెచ్ఎస్ సరళమ్మ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డాక్టర్ బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.