సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

ABN , First Publish Date - 2021-12-07T07:33:47+05:30 IST

తిరుమల శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యంగా భావించే ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది.

సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

శ్రీవారి ఆలయంలో 17నుంచి అమలు


తిరుమల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యంగా భావించే ధనుర్మాసం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, ధనుర్మాస ఘడియలు 2022 జనవరి 14న ముగియనున్నాయి.ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారని పురాణ కథనం. అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్‌ (గోదాదేవి) ఒకరు. ఆమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తి బదులుగా శ్రీకృష్ణస్వామికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. 

Updated Date - 2021-12-07T07:33:47+05:30 IST