రెండో విడత నాడు-నేడు పనులకు 1300 బడుల ఎంపిక
ABN , First Publish Date - 2021-09-04T05:10:51+05:30 IST
జిల్లాలో రెండో విడత నాడు-నేడు పనులకు 1300 పాఠశాలలు ఎంపికయ్యాయని డీఈవో పురుషోత్తం, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

చిత్తూరు(సెంట్రల్), సెప్టెంబరు 3: జిల్లాలో రెండో విడత నాడు-నేడు పనులకు 1300 పాఠశాలలు ఎంపికయ్యాయని డీఈవో పురుషోత్తం, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై హెచ్ఎంలు దృష్టి సారించేలా ఎంఈవోలు చూడాలని సూచించారు. శుక్రవారం స్థానిక సమగ్రశిక్ష సమావేశ మందిరంలో ఎంఈవోలతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రొటోకాల్ తప్పక పాటించాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంఈవోలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను సమావేశానికి తప్పక ఆహ్వానించాలన్నారు. ఈనెల 22న జరిగే పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికలపై దృష్టి సారించి విద్యార్థుల ఆధారంగా వారి తల్లిదండ్రులకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీఎంవో గుణశేఖర్, సెక్టోరియల్స్ మోహన్ సింగ్, షాధిక్ ఆలీ, ఎంఈవోలు పాల్గొన్నారు.