గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-17T07:31:43+05:30 IST
గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం ఉదయం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.
తిరుపతి(కల్చరల్), సెప్టెంబరు 16: గోవిందరాజ స్వామి ఆలయంలో గురువారం ఉదయం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన చేపట్టారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలో సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీదేవి, భూదేవి సహిత గోవిందరాజస్వామి ఉత్సవర్లను ఆలయంలోని యాగశాలకు వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. యాత్రికుల వల్లగాని, సిబ్బంది వల్లగాని తెలిసో తెలియకో జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములతో పాటు ఆలయ ప్రధానార్చకుడు శ్రీనివాసదీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆగమ సలహాదారులు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈవో రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు, సిబ్బంది పాల్గొన్నారు.