కుమార్తెకు సీటు రాలేదని తండ్రి ఆందోళన

ABN , First Publish Date - 2021-02-06T05:18:45+05:30 IST

వ్యవసాయ కళాశాలలో తన కుమార్తెకు ఫార్మర్‌ కోటాలో సీటు రాలేదని ఆమె తండ్రి శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో ఆందోళనకు దిగారు.

కుమార్తెకు సీటు రాలేదని తండ్రి ఆందోళన
కళాశాల ద్వారం వద్ద బైఠాయించిన తిరుమలరెడ్డి

ఎస్వీ వ్యవసాయ కళాశాల ద్వారం వద్ద బైఠాయింపు


తిరుపతి(విద్య), ఫిబ్రవరి 5: వ్యవసాయ కళాశాలలో తన కుమార్తెకు ఫార్మర్‌ కోటాలో సీటు రాలేదని ఆమె తండ్రి శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో ఆందోళనకు దిగారు. చంద్రగిరి మండలంలోని తొండవాడకు చెందిన తిరుమలరెడ్డి అనే రైతు కళాశాల ద్వారం ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుకోటాలో అడ్మిషన్‌ కోసం కళాశాలను సందర్శించినప్పుడు సీటు తప్పకుండా వస్తుందని చెప్పారన్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయినా తన కుమార్తెకు సీటు రాలేదని వాపోయారు. ఈ విషయమై కళాశాలలో అడిగితే.. గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి వెళ్లి తెలుసుకోవాలని సమాధానం ఇస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌లో మాత్రం సమీపంలోని కళాశాలను సందర్శించాలని సూచించినట్లు పేర్కొన్నారు. పైగా సీటు రాదని తెలిస్తే వేరే కోర్సులో అడ్మిషన్‌ కోసం ప్రయత్నించే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. వర్సిటీ పరిధిలో ఫార్మర్‌ కోటా కింద బాలుర విభాగంలో దాదాపు 2,500 ర్యాంకులోపు, బాలికల విభాగంలో దాదాపు మూడువేల ర్యాంకులోపు వారికే సీట్లు వచ్చినట్లు సమాచారం. ఆయన కుమార్తెకు వచ్చిన ర్యాంకు ఎక్కువగా ఉందని, అందువల్ల సీటువచ్చే అవకాశం లేదని కళాశాల అధ్యాపక వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-02-06T05:18:45+05:30 IST