చెత్తపెంటకు తరలిన తహసీల్దార్‌

ABN , First Publish Date - 2021-10-04T07:28:26+05:30 IST

తహసీల్దార్‌ కుప్పస్వామి తమ సిబ్బందితో కలిసి ఆదివారం పలమనేరు మండలంలోని చెత్తపెంట గ్రామానికి వెళ్లారు.

చెత్తపెంటకు తరలిన తహసీల్దార్‌
పిడుగు బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరిస్తున్న తహసీల్దార్‌

పలమనేరు, అక్టోబరు3 : తహసీల్దార్‌ కుప్పస్వామి తమ సిబ్బందితో కలిసి ఆదివారం పలమనేరు మండలంలోని చెత్తపెంట గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన వెంకటేషు, రాజేశ్వరి దంపతుల ఇద్దరు కుమారులు 2015లో పిడుగుపాటుకు గురై రెండుకాళ్లు కాలిపోవడం, చికిత్స కోసం అప్పులు పాలై,  ఏడేళ్లుగా సీఎం సహాయ నిధికోసం వారు ఎదురుచూస్తున్న వైనంపై ఆదివారం ఆంధ్రజ్యోతిలో వాళ్లబతుకుల్లో పిడుగుపడింది శీర్షికన వార్త ప్రచురితమైంది. దీంతో తహసీల్దార్‌ కుప్పస్వామి స్పందించి  చెత్తపెంటకు వెళ్లారు. పిడుగు బాధిత కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.  వారు వైద్యానికి వెచ్చించిన మొత్తాన్ని, అందుకు సంబంధించిన రసీదులు, బిల్లుల జిరాక్సు కాపీలు తీసుకొన్నారు. అంతేకాక వారు భూమి అమ్ముకొన్న వైనంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కుప్పస్వామి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వెంకటేషు, రాజేశ్వరి ఇద్దరు కుమారులు పిడుగుపాటు కు గురైన ఘటనకు సంబంధించి వివరాలు సేకరించామని, నివేదికను జిల్లా అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.  తమకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం అందితే తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని బాధితులు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-04T07:28:26+05:30 IST