త్వరలో రుయాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం
ABN , First Publish Date - 2021-08-25T06:19:36+05:30 IST
రానున్న రోజుల్లో తిరుపతిలోని రుయాస్పత్రిలో పేదలకు మరింత మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) వీసీ, ఎండీ మురళీధర్రెడ్డి తెలిపారు.

తిరుపతి సిటీ, ఆగస్టు 24: రానున్న రోజుల్లో తిరుపతిలోని రుయాస్పత్రిలో పేదలకు మరింత మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఏపీ మెడికల్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) వీసీ, ఎండీ మురళీధర్రెడ్డి తెలిపారు. రుయాస్పత్రిని మంగళవారం ఆయన జేసీ వీరబ్రహ్మంతో కలిసి సందర్శించారు. నాడు-నేడు కింద రుయాస్పత్రికి, ఎస్వీ వైద్య కళాశాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందన్నారు. రుయాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్, పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్ను ఆయన పరిశీలించారు. ఇవి పనిచేస్తున్న విధానం గురించి ఎస్ఈ కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొన్ని వార్డులను, పరిసరాలను చూశారు. నాడు-నేడు పనుల రికార్డులు పరిశీలించారు. రుయాలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ఎంతో మంది ప్రాణాలను కాపాడారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయభాస్కర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, రుయా ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రోజారమణి, ఏపీఎంఎస్ఐడీసీ డీఈ ధనుంజయరెడ్డి, రుయాస్పత్రి అడ్మినిస్ట్రేటర్ ఉమామహేశ్వరావు, పీఆర్వో వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు.