తిరుమల నడకదారిలో ఆళ్వార్ తీర్థం పునరుద్ధరణ
ABN , First Publish Date - 2021-04-19T07:00:18+05:30 IST
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆళ్వార్ తీర్థాన్ని రామానుజాచార్యుడి జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
తిరుపతి/తిరుమల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆళ్వార్ తీర్థాన్ని రామానుజాచార్యుడి జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలిపిరి నుంచి గాలిగోపురానికి వెళ్లే మార్గంలోని 950వ మెట్టు వద్ద ఈ ఆళ్వార్ తీర్థం ఉండటం విశేషం. చెన్నైకి చెందిన ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీరామ్ తిరుమలలోని తీర్థాలను పరిశోధిస్తూ.. ఈ తీర్థం ఉనికిని తిరుమళీశై ఆళ్వార్ పాసురాల్లో చూశారు. 2004లో నడకదారిలో ఈ తీర్థాన్ని గుర్తించారు. దీని విశిష్టతను తిరుపతిలోని ట్రెక్కర్స్కు వివరించారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో పెద్ద పెద్ద వృక్షాల మధ్య, రాతితో నిర్మితమైన శిథిల స్థితిలో ఉన్న ఆళ్వార్ తీర్థం పునరుద్ధరణ పనులను టీటీడీ అటవీశాఖ సహకారంతో ఆదివారం ట్రెక్కర్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్వో చంద్రశేఖర్ యాదవ్, రేంజర్లు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులుతోపాటు ట్రెక్కర్స్ అయిన శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్, రాఘవశర్మ, శ్రీరాం, సుబ్బరాయుడు, శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.