చట్టసభల్లో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్ కల్పించాలి
ABN , First Publish Date - 2021-12-15T06:42:33+05:30 IST
చట్టసభల్లో జ్ఞాననేత్రులకు ఒక్కశాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఒంగోలుకు చెందిన శ్రీనివాస ఫణి చేపట్టిన పాదయాత్ర ఏర్పేడు చేరుకుంది.

ఏర్పేడు, డిసెంబరు 14: చట్టసభల్లో జ్ఞాననేత్రులకు ఒక్కశాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఒంగోలుకు చెందిన పొన్నలూరి శ్రీనివాస ఫణి చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఏర్పేడు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 12న తిరుచానూరు వద్ద ఉన్న నవజీవన్ బ్లైండ్హోం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. వందలాది కిలోమీటర్ల పాదయాత్రను మనోధైర్యంతో పూర్తి చేస్తానని చెప్పారు. అయితే జ్ఞాననేత్రులు ఎన్నో అవమానాలను భరిస్తూ ఆత్మవిశ్వాసంతో పలురంగాల్లో విజయాలు సాధిస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు తమకు విద్య, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ ఇస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులుగా సేవ చేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. తమ న్యాయమైన కోరికను సమాజానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.