ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
ABN , First Publish Date - 2021-08-10T07:23:37+05:30 IST
అక్రమ రవాణాకు సిద్దంగా ఉన్న రూ.5లక్షల విలువైన మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఓ స్మగ్లర్ను అరెస్టు చేశారు.
![ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081001511890/08102021015246n92.jpg)
రూ.5 లక్షల ఎర్రచందనం దుంగల స్వాధీనం
తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 9: అక్రమ రవాణాకు సిద్దంగా ఉన్న రూ.5లక్షల విలువైన మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఓ స్మగ్లర్ను అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం టాస్క్ఫోర్స్ ఎస్పీ సుందరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్ఐ సురేష్బాబు తన బృందంతో కరకంబాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లోని కుప్పరాళ్ళగుట్ట వద్ద కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తూ కనిపించారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు పట్టుబడగా మిగిలినవారు పరారయ్యారు. అతడిచ్చిన సమాచారంతో మూడు దుంగలు, ఓ గొడ్డలి, గునపాన్ని స్వాధీనం చేసుకుని టాస్క్ఫోర్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన స్మగ్లర్.. ఏర్పేడు మండలం బత్తినయ్యకాలనీకి చెందిన జి.వెంకటేశు(60)గా గుర్తించారు. బత్తినయ్య కాలనీకి చెందిన భక్తవత్సలం, మంగళంకు చెందిన శివ ఎర్రచందనం దుంగలకోసం తనను సంప్రదించారన్నారు. దీంతో తమకాలనీకి చెందిన తుపాకుల మారయ్య, మణి, రమణ, వేలు కలసి శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్లు వెంకటేశు విచారణలో అంగీకరించాడు. కేసు నమోదుచేసిన సీఐ సుబ్రహ్మణ్యం పారిపోయిన నలుగురికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో సీఐ చంద్రశేఖర్, ఎఫ్ఆర్వో ప్రసాద్, డీఆర్వో జానీబాషా పాల్గొన్నారు.