తిరుపతిలో వర్షం
ABN , First Publish Date - 2021-11-26T08:10:11+05:30 IST
వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో అతలాకుతలమైన తిరుపతి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా గురువారం రాత్రి దాదాపు గంటపాటు వర్షం కురిసింది.

తిరుపతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో అతలాకుతలమైన తిరుపతి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా గురువారం రాత్రి దాదాపు గంటపాటు వర్షం కురిసింది.ఎయిర్బైపాస్ రోడ్డులో వరదనీరు ఇప్పటికీ తగ్గకపోగా రాత్రి కురిసిన వర్షం నీరు తోడవడంతో వాగులు, వంకలు పారినట్టు కనిపించింది.చేపల మార్కెట్ రోడ్డు, దేవేంద్ర థియేటర్, లీలామహల్, మున్సిపల్ కార్యాలయం రోడ్డు, స్విమ్స్ రోడ్డులో నీరు వెల్లువలా ప్రవహించింది. మధురానగర్లో ఇళ్లలోకి నీరు చేరిపోయింది. వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై ఏమూల ఏగుంత ఉందో అని భయపడుతూ వాహనాలను ముందుకు నడపాల్సివచ్చింది. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వాళ్లు ఆందోళన పడుతున్నారు.ఇళ్లకు ఎప్పుడు చేరుతామో అని పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ఆవేదన చెందుతున్నారు.తిరుపతి రూరల్,రేణిగుంట,ఏర్పేడు, తొట్టంబేడు,శ్రీకాళహస్తి,కలికిరి, చంద్రగిరి,నాగలాపురం మండలాల్లోనూ గురువారం వర్షం కురిసింది.