సామాజిక న్యాయం దెబ్బతీయడానికే ప్రైవేటీకరణ
ABN , First Publish Date - 2021-12-28T06:33:23+05:30 IST
సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఆరోపించారు.
![సామాజిక న్యాయం దెబ్బతీయడానికే ప్రైవేటీకరణ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122801022989/12282021010237n47.jpg)
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరోపణ
తిరుపతి(కల్చరల్), డిసెంబరు 27: సామాజిక న్యాయాన్ని దెబ్బతీసి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఆరోపించారు. ఏఐటీయూసీ జిల్లా 15వ ప్రతినిధుల సమావేశాలు సోమవారం తిరుపతి బైరాగిపట్టెడలోని సీపీఐ భవనంలో నాయకులు కోదండం, ప్రేమ, రాజు అధ్యక్షతన జరిగాయి. ఏఐటీయూసీ జెండాను జిల్లా గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య ఆవిష్కరించగా, ఇటీవల మృతి చెందిన కార్మికులకు సంతాప తీర్మానాన్ని చిన్నం పెంచలయ్య ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓబులేసు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి.. బడుగు, బలహీనవర్గాల వారిని బానిసలుగా మార్చే విధానాలు ప్రధాని మోదీ ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. దీనికి నిరసనగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, పారిశుధ్య కార్మికులకు రూ.24,000 కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి పి.మురళి, నాయకులు రాధాకృష్ణ, రాజు, రవి, శివ, సాంబ తదితరులు పాల్గొన్నారు.