గసగసాల సాగు కేసులో ముద్దాయిపై పీటీ వారెంట్‌ !

ABN , First Publish Date - 2021-03-22T07:45:06+05:30 IST

హెరాయిన్‌ తయారీకి ఉపయోగించే గసగసాల కాయల సాగు కేసులో మదనపల్లె ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసిన వెంకటరమణపై తెలంగాణ పోలీసులు పీటీ వారెంట్‌ వేస్తున్నట్లు సమాచారం.

గసగసాల సాగు కేసులో ముద్దాయిపై పీటీ వారెంట్‌ !

తెలంగాణాలో కూడా గసగసాల సాగు


మదనపల్లె టౌన్‌, మార్చి 21: హెరాయిన్‌ తయారీకి ఉపయోగించే గసగసాల కాయల సాగు కేసులో మదనపల్లె ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసిన వెంకటరమణపై తెలంగాణ పోలీసులు పీటీ వారెంట్‌ వేస్తున్నట్లు సమాచారం. మదనపల్లె మండలం దేవళంపల్లె వద్ద గసగసాలపంట సాగుపై ఎస్‌ఈబీ పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రెండు బస్తాల గసగసాలకాయలను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కత్తివారిపల్లెకు చెందిన ముగ్గురు రైతులు నాగరాజు, లక్ష్మన్న, సోమశేఖర్‌లను ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయగా చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లె వెంకటరమణ, రేవన్‌కుమార్‌ వద్ద గసగసాలకాయల పొడి వుండగా అరెస్టుచేసిన మదనపల్లె ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో తెలంగాణ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని లేమూర్‌ గ్రామం వద్ద కూడా ఓ వ్యక్తి రెండెకరాల విస్తీర్ణంలో గసగసాల(ఓపీఎం)పంటను  సాగు చేస్తుండగా అక్కడి పోలీసులు దాడులు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో గసగసాలపంట సాగుకు సహకరించిన చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లె వెంకటరమణ పాత్ర వున్నట్లు తెలంగాణ పోలీసులు నిర్దారించినట్లు సమాచారం. ఈ క్రమంలో మదనపల్లె సబ్‌జైలులో రిమాండులో వున్న వెంకటరమణను పీటీ వారెంట్‌ కింద కస్టడీలోకి తీసుకుని తెలంగాణ పోలీసులు విచారించనున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-03-22T07:45:06+05:30 IST