అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోటి నష్టం

ABN , First Publish Date - 2021-03-07T07:41:24+05:30 IST

అధికారుల నిర్లక్ష్యంతో ఏపీసీడ్స్‌(విత్తనశుద్ధి కర్మాగారం)లో ఏడాది కాలంగా వెయ్యిటన్నుల ధాన్యం మగ్గుతోంది

అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోటి నష్టం
ఏపీసీడ్స్‌ గోదాములో ధాన్యం నిల్వలు

శ్రీకాళహస్తి, మార్చి 6: నాణ్యతపై అనుమానాలు.. కల్తీ ధాన్యమన్న అపోహ. అధికారుల నిర్లక్ష్యం. అన్నీ వెరసి శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏపీసీడ్స్‌(విత్తనశుద్ధి కర్మాగారం)లో  ఏడాది కాలంగా వెయ్యిటన్నుల ధాన్యం మగ్గుతోంది. మార్కెట్‌ ధర మేరకు ఈ ధాన్యం విలువ రూ.3.15 కోట్ల పైమాటే. నాణ్యతపై అనుమానాలు ఉండటంతోనే ధాన్యం కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. ధాన్యం వేలం వేయాల్సి వస్తుందనీ, దీంతో సంస్థకు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది. 

 ఏపీసీడ్స్‌ ఆధ్వర్యంలో గత ఏడాది రబీ సీజనులో జిల్లా రైతుల నుంచి 70 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం సేకరణ జరిగింది. ఆ సమయంలో ఏపీసీడ్స్‌ అధికారులు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కొంత కల్తీ ధాన్యం కలిసింది. దీంతో విత్తనశుద్ధి సమయంలో తీవ్ర సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా వరిసాగుకు సంబంధించి కల్తీలేని విత్తనాలను ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయించారు. కొంతమేర జిల్లాలోని రైతులకు సరఫరా చేశారు. అయితే సుమారు వెయ్యి టన్నుల ధాన్యం గోడౌన్లలో మిగిలిపోయింది. ఏపీసీడ్స్‌ అధికారులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర విత్తన వ్యాపారులతో సంప్రదించినా ఫలితం లేకపోయింది. విత్తనం నాణ్యత లేదన్న కారణంతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం కొత్తగా ధాన్యం సేకరణకు ఏపీసీడ్స్‌ రంగం సిద్ధం చేసింది. దీంతో ఏడాదికాలంగా మగ్గుతున్న ధాన్యం విక్రయించడానికి వేలమే శరణ్యమని ఇక్కడి అధికారులు అంటున్నారు. లేదంటే కొత్తగా సేకరించిన ధాన్యం నిల్వకు గోదాముల కొరత ఏర్పడి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీసీడ్స్‌ అధికారుల నిర్వాకంతో సంస్థకు రూ.కోటి నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది. 

Updated Date - 2021-03-07T07:41:24+05:30 IST