సింగిల్విండోల పీఐసీల పొడిగింపునకు ప్రభుత్వం నో
ABN , First Publish Date - 2021-02-01T05:30:00+05:30 IST
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు(సింగిల్విండో) పర్సన్ ఇన్చార్జి కమిటీ(పీఐసీ) పొడిగింపునకు ప్రభుత్వం నో అనేసింది.

అధికార పీఐసీల ఏర్పాటుకు కసరత్తు
మదనపల్లె, ఫిబ్రవరి 1: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు(సింగిల్విండో) పర్సన్ ఇన్చార్జి కమిటీ(పీఐసీ) పొడిగింపునకు ప్రభుత్వం నో అనేసింది. అధికార పర్సన్ ఇన్చార్జి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాలోని 66 సింగిల్విండోల్లో 12 సంఘాలకు ఏప్రిల్ చివరి వరకు కమిటీలను పొడిగించగా మిగతా 54 విండోలకు కూడా వీటితో సమానంగా మరో నాలుగు నెలలు గడువిస్తారని భావించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పటికే ఉన్న త్రీమెన్ కమిటీకి స్వస్తి చెప్పి అధికార పర్సన్ ఇన్చార్జి కమిటీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాగా 54 కమిటీలకు జనవరి 30తో గడువు ముగిసింది. ఈనేపథ్యంలో జిల్లాలోని సహకారశాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులను పీఐసీలుగా నియమించడానికి సహకారశాఖ కమిషన్ నుంచి ఆదేశాలు రావడంతో వీరి ఎంపికలో జిల్లా అధికారులు తలమునకలై ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ఈ కమిటీలను తాత్కాలికంగా నియమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.