ఎస్సీ వర్గీకరణ సాధించే వరకూ ఉద్యమం
ABN , First Publish Date - 2021-01-13T05:12:15+05:30 IST
ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
తంబళ్లపల్లె, జనవరి 12: ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం తంబళ్లపల్లెలో జరిగిన ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం, ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం వలన ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటం నడపాల్సి వస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వర్గీకరణ చేస్తాం అని మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా వర్గీకరణ చేయకుండా దగా, మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకం పెట్టారని, అప్పటి ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారన్నారు. అంతేకాకుండా, ఇడుపులపాయలో వైసీపీ ఆవిర్భావ సమయంలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని చెప్పి, తీరా ఆధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాట తప్పారన్నారు.వర్గీకరణ సాధించేంత వరకూ ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ప్రతి ఒక్క మాదిగ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ, జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సుబ్బరాం, యువసేన రాష్ట్ర నాయకులు చిన్నా, మునిరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధక్షుడు వెంకటప్పమాదిగ, తంబళ్లపల్లె ఇంచార్జ్ మల్లిఖార్జున, నాగమల్లయ్య, బొజ్జప్ప, మల్లికార్జున, గోపి పాల్గొన్నారు.