మినీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ : పదిమంది రైతులకు గాయాలు
ABN , First Publish Date - 2021-01-27T05:55:40+05:30 IST
మినీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొని 10మంది రైతులు గాయపడ్డారు
నాగలాపురం, జనవరి 26: మినీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొని 10మంది రైతులు గాయపడ్డారు. నాగలాపురం పోలీసులు తెలిపిన వివరాలు... పిచ్చాటూరుకు చెందిన మినీ బస్సులో పత్రి రోజూ రాత్రి 12 గంటలకు రైతులు పూలను కోయంబేడు మార్కెట్లో విక్రయించి ఉదయం తిరుగు ప్రయాణం అవుతుంటారు. మంగళ వారం ఉదయం మార్కెట్ నుంచి మినీ బస్సులో 10 మంది రైతులు తిరుగు ప్రయాణమయ్యారు. నాగలాపురం మండలం నందనం వద్ద రీచ్ నుంచి రోడ్డుపైకి వస్తున్న టిప్పర్ను మినీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది రైతులు గాయాలయ్యాయి. ఇందులో సుబ్రమణి(60), కన్నియప్పన్(50), పంజమ్మ(60), సరళ(38) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి నాగలాపురంలో పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు చికిత్సలు చేయించుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు నాగలాపురం ఎస్ఐ నరేష్ వెల్లడించారు.