రుయాస్పత్రి వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-20T06:24:04+05:30 IST
రేణిగుంటలో వైసీసీ వర్గీయుల దాడిలో గాయపడిన టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, చక్రాల ఉష, బాషా రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

వైద్య పరీక్షలు చేసుకుని వస్తున్న టీడీపీ నేతలను అటకాయించిన ఎంపీ
సీఎంకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండు
తిరుపతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రేణిగుంటలో వైసీసీ వర్గీయుల దాడిలో గాయపడిన టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, చక్రాల ఉష, బాషా రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సుధీర్రెడ్డి వెన్నెముకకు గాయమైనట్టు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. అనంతరం వీరు రుయా నుంచి తిరిగి వస్తుండగా తిరుపతి ఎంపీ గురుమూర్తి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ సుధీర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకుని.. బైఠాయించారు. టీడీపీ నేతలపై దాడి నేపథ్యంలో అర్బన్ ఎస్పీ వారికి రక్షణగా ఎస్కార్ట్ను సమకూర్చారు. అయినప్పటికీ దాదాపు అరగంట పాటు టీడీపీ నేతలను రుయా నుంచి వెళ్లనీయకుండా ఎంపీ, వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అలిపిరి పోలీసులతో పాటు ఎస్కార్ట్గా ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించి వారిని అక్కడనుంచి పంపించేశారు. దాడికి గురై చికిత్స కోసం రుయాస్పత్రికి వస్తే ఇక్కడకూడా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగడం బాధాకరమని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ నేతల దాడిలో తన వెన్నెముక వద్ద గాయమైందని సుధీర్రెడ్డి పేర్కొన్నారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని అర్బన్ ఎస్పీకి ఆధారాల సహా ఫిర్యాదు చేశానని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ మునికృష్ణ, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.