రోడ్డు ప్రమాదంలో కేడీసీ ప్రిన్సిపాల్ వాసుదేవన్ మృతి
ABN , First Publish Date - 2021-08-02T05:04:01+05:30 IST
కుప్పం-మల్లానూరు మార్గంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వాసుదేవన్ (43) మృతి చెందారు.
కుప్పం, ఆగస్టు 1: కుప్పం-మల్లానూరు మార్గంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వాసుదేవన్ (43) మృతి చెందారు. స్థానికులు, కళాశాల వర్గాల సమాచారం మేరకు... ప్రిన్సిపాల్ వాసుదేవన్ గుండ్లసాగరం మార్గంలో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంటికి అవసరమైన టైల్స్ కొనుగోలు కోసం ఆదివారం ఉదయం కార్పెంటర్ను తీసుకుని ద్విచక్ర వాహనంపై మల్లానూరు బయలుదేరారు. రాగిమానుమిట్ట క్రాస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ను చూసుకోకుండా అతివేగంగా వాహనం నడిపారు. దీంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి వాసుదేవన్తోపాటు అతని వెంట ఉన్న కార్పెంటర్ సైతం కింద పడ్డారు. వాసుదేవన్ తలకు బలమైన గాయాలు కావడంతోపాటు నోరు, ముక్కులనుంచి రక్తస్రావం జరిగింది. స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేయగా అది వచ్చేలోగానే వాసుదేవన్ మృతి చెందారు. కార్పెంటర్ తీవ్ర గాయాలతో పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వాసుదేవన్కు భార్య, ఐదేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు ఆడ పిల్లలున్నారు.