తిరుమలలో కర్ణాటక భక్తుల నిరసన
ABN , First Publish Date - 2021-12-26T06:31:22+05:30 IST
తిరుమలలోని జేఈవో కార్యాలయం వద్ద కర్ణాటకకు చెందిన కొందరు భక్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు.

తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని జేఈవో కార్యాలయం వద్ద కర్ణాటకకు చెందిన కొందరు భక్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు విశ్వనాథ్ సిఫార్సు లేఖతో 85 మంది తిరుమలకు వచ్చామన్నారు. విశ్వనాథ్ పీఆర్వో మారుతికి రూ.25వేలను పంపి, 85 మందికి దర్శనం కల్పించాలని కోరామన్నారు. తిరుమలకు వచ్చి ఫోన్ చేయమని చెప్పిన మారుతి ఎంతకీ తమ వద్దకు రాలేదని వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన తాము ఉదయం నుంచి రాత్రి వరకు చలికి తీవ్ర ఇబ్బందులు పడ్డామని చెప్పారు. తీరా జేఈవో కార్యాలయం వద్దకు వచ్చి సిబ్బందిని అడిగితే, వారి నుంచి సరైన స్పందన లభించలేదన్నారు. పైగా బయటికి పోవాలంటూ దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనం కల్పించేవరకు తాము అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ సమాచారంతో విజిలెన్స్ వీజీవో బాలిరెడ్డి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సిఫార్సు లేఖ ఇచ్చిన బోర్డు సభ్యుడు విశ్వనాథ్తో భక్తులను ఫోన్లో మాట్లాడించారు. ఆపై నచ్చజెప్పి అక్కడినుంచి పంపారు.