ప్రజల ఆస్తులను కాపాడటం మన బాధ్యత
ABN , First Publish Date - 2021-08-21T08:04:24+05:30 IST
ప్రజల ఆస్తులను కాపాడటం మన బాధ్యత అని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు.
![ప్రజల ఆస్తులను కాపాడటం మన బాధ్యత](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082102320215/08212021023238n18.jpg)
ఎస్పీ వెంకట అప్పలనాయుడు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 20: ప్రజల ఆస్తులను కాపాడటం మన బాధ్యత అని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రాపర్టీ కేసులకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీసు అతిథి భవనంలోని సమావేశ మందిరంలో అధికారులు, క్రైమ్ పార్టీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేరాలను అరికట్టడంపై అవగాహన కల్పించారు. జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల ముసుగులో నేరస్తులు కూడా వస్తారన్నారు. వీరిని గుర్తించడానికి ఫిన్స్, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పాపిల్లాన్ పరికరాలతో రద్దీ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పోలీసు స్టేషన్కు వచ్చే ప్రతి కేసునూ సీరియస్గానే పరిగణించాలన్నారు. ప్రజలను భాగస్వాములను చేసి వీధుల్లో, అపార్ట్మెంట్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రార్థనా మందిరాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు, నగర శివారు ప్రాంతాలు, ఆలయాల వద్ద నిఘా పెంచాలని, బీట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. సమావేశంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఆరీఫుల్లా, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, డీఎస్పీలు నరసప్ప, మురళీకృష్ణ, రామరాజు పాల్గొన్నారు.