కోవ్యాక్సిన్ వస్తుందా ?
ABN , First Publish Date - 2021-05-03T04:31:30+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి
రెండో డోస్ కోసం 62967 మంది ఎదురు చూపు
ఇప్పుడే వచ్చే పరిస్థితి లేదు... వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
ఆందోళనలో మొదటి డోస్ వేసుకున్నవారు
చిత్తూరు రూరల్, మే 2: జిల్లాలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలకు కరోనా అంటే భయంతో పాటు వ్యాక్సిన్స్పై నమ్మకం వచ్చింది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకున్న వారు కొందరు మృతి చెందడంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలతో పాటు వైద్యలు, సిబ్బంది వెనకడుగు వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సీను మారింది. ఒక్కసారిగా జిల్లాలో కేసులతోపాటు మరణాలు కూడా పెరగడంతో ప్రజలు వ్యాక్సినేషన్కు మందుకు వస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 573116 మంది వ్యాక్సిన్ వేసుకోగా, ఇందులో కోవిషీల్డ్ 409324, కోవ్యాక్సిన్ 82814 మంది వ్యాక్సిన్ వేయించకున్నారు.
రెండో డోస్ కోసం 62967 మంది ఎదురు చూపులు
జిల్లాలో కోవ్యాక్సిన్ మొదటి డోస్ 82814 మంది వేసుకోగా రెండవ డోస్ కేవలం 19847 మంది మాత్రమే వేసుకున్నారు. ఇంకా 62967 మంది రెండవ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వస్తుందా లేదా అనే క్లారిటీ కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో లేదు. దీంతో రెండవ డోస్ కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు వ్యాక్సినేషన్ జరుగుతున్న కేంద్రాలకు వచ్చి అడిగి వెళ్తూన్నారు.
నాకెట్ల తెలుస్తుంది కేంద్రాన్ని అడగాలి
కోవ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో నాకెట్ల తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. వాళ్లు ఇచ్చిన వెంటనే పంపిస్తాం. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.
- డీఎంహెచ్వో పెంచలయ్య