అక్రమ డిప్యుటేషన్లు పునరావృతం కాకూడదు
ABN , First Publish Date - 2021-12-30T06:29:42+05:30 IST
జిల్లాలో విద్యాశాఖలో ఇకపై అక్రమ డిప్యుటేషన్లు వ్యవహారం పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
![అక్రమ డిప్యుటేషన్లు పునరావృతం కాకూడదు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123012575611/12302021005937n80.jpg)
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 29: జిల్లాలో విద్యాశాఖలో ఇకపై అక్రమ డిప్యుటేషన్లు వ్యవహారం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖ, సమగ్ర శిక్షలోని వివిధ అంశాలపై విచారణ నిమిత్తం బుధవారం జిల్లాకు వచ్చిన ఆర్జేడీ పాత కలెక్టరేట్లోని చిత్తూరు డిప్యూటీ డీఈవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ సిబ్బంది, సమగ్రశిక్ష అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతల విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖలో ఇటీవల కాలంలో 109 డిప్యుటేషన్లు జరగగా, వాటిలో 97 రద్దు చేశామని చెప్పారు. మిగిలిన వాటిని కూడా క్షుణ్నంగా పరిశీలించి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావుతం కాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో సీబీఎస్ఈ అమలు చేసేందుకు అనువైన పాఠశాలలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు సమీపించిన నేపథ్యంలో సీ, డీ గ్రేడ్ విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఫీడ్బ్యాక్ తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ కార్యాలయం ఏడీ శ్రీనివాసులు, డీఈవో పురుషోత్తం, ఏపీమోడల్ స్కూల్, ఎండీఎం ఏడీలు నాగరాజు, విజయేంద్రరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.