జోరు వాన.. హోరు గాలి
ABN , First Publish Date - 2021-05-21T07:15:39+05:30 IST
తిరుపతిలో బుధవారం అర్ధరాత్రిపైన గంటపాటు హోరుగాలి, జోరు వాన కురిసింది.

తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో బుధవారం అర్ధరాత్రిపైన గంటపాటు హోరుగాలి, జోరు వాన కురిసింది. దీంతో పలు చెట్ల కొమ్మలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గురువారం సాయంత్రం మరో గంట పాటు కురిసిన వర్షానికి నగరంలోని అండర్ బ్రిడ్జిలు నీటితో చేరాయి. కాలువల నుంచి రోడ్లపైకి వర్షపునీటితో కలిసి మురుగునీరు పొంగింది. తిరుపతి చుట్టుపక్కల మండలాలతో పాటు జిల్లాలోని పడమట మండలాల్లో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. తిరుమలలోనూ భారీ వర్షం కురిసింది. మూడు రోజుల ముందు వరకు 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత గత రెండుజులుగా గరిష్టంగా 37, కనిష్టంగా 26 డిగ్రీలు నమోదుకావండతో చల్లటి వాతావరణం కనిపించింది.
వ్యాక్సిన్ సెంటర్లలో పడిపోయిన షెడ్లు
కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లైన ఇందిరా మైదానం, నెహ్రూమున్సిపల్ స్కూల్లో తాత్కాలికంగా వేసిన షెడ్లు బుధవారం నాటి గాలికి నేలకొరిగాయి. వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆఖరిరోజైన గురువారం 700 డోసులే ఉండడంతో త్వరగా పూర్తిచేశారు. ఈసందర్భంగా పలువురు కొవాగ్జిన్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరిగారు. మరో రెండు రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
