అమర ఆస్పత్రి సేవలు భేష్!
ABN , First Publish Date - 2021-03-05T07:11:04+05:30 IST
అమర ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు యాజమాన్యాన్ని కోరారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రేణిగుంట, మార్చి 4: అమర ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు యాజమాన్యాన్ని కోరారు. గురువారం ఉదయం రేణిగుంట మండలం కరకంబాడిలో అమరరాజా గ్రూప్స్ ఛైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతుల కుమార్తె, అల్లుడు డాక్టర్ రమాదేవి గౌరినేని, డాక్టర్ ప్రసాద్ గౌరినేని నిర్మించిన అమర అత్యాధునిక ఆస్పత్రిని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ఆస్పత్రికి అనారోగ్యంతో వచ్చేవారు ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి వెళ్ళాలని ఆకాంక్షించారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో అమర హాస్పిటల్ ప్రజలకు అందించిన వైద్య సేవలు అభినందనీయమన్నారు.వైద్యసేవలు అందించిన వైద్యులను, నర్సులను, సిబ్బందిని అభినందించారు. కాగా ఉదయం 11.20 గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరినేని, ఎండీ డాక్టర్ రమాదేవి గౌరినేని, అమరరాజా గ్రూప్స్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆస్పత్రిలో సుమారు గంటపాటు గడిపిన వెంకయ్య గల్లా కుటుంబీకులతో మాట్లాడి ఆస్పత్రిలోని విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దిన ఛైర్మన్, ఎండీలను ప్రశంసించారు.డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర రెడ్డి, మధుసూదన రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
గల్లా నివాసంలో ఉపరాష్ట్రపతి
కాగా గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గల్లా కుటుంబీకులతో సుమారు ఐదు గంటలకు పైగా గడపడం విశేషం. తొలుత అమర ఆస్పత్రిని ప్రారంభించిన వెంకయ్య అక్కడే గంటపాటు గడిపారు. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు కరకంబాడిలోనే అమరరాజా ఫ్యాక్టరీ ఆవరణలో వున్న గల్లా రామచంద్ర నాయుడి నివాసానికి వెళ్ళారు. మధ్యాహ్నం అక్కడే భోంచేశారు. సాయంత్రం 4.15 గంటల వరకూ ఆ కుటుంబీకులతో గడిపారు. ఉపరాష్ట్రపతి వెంట ఆయన సతీమణి కూడా వున్నారు. సాయంత్రం 4.15 గంటలకు అక్కడ నుంచీ బయల్దేరి నేరుగా తిరుమల వెళ్ళారు. గురువారం రాత్రికి ఆయన అక్కడే బస చేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుంటారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తిరుమల నుంచీ బయల్దేరి వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ వెళ్ళనున్నారు.