ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-08-20T05:35:57+05:30 IST
ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటున్న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిశోర్ ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
![ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో మోసం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921082012043233/08202021000453n5.jpg)
నలుగురు చీరాలవాసుల అరెస్టు
చిత్తూరు, ఆగస్టు 19: ఫిలిప్పైన్స్ దేశంలో ఉంటున్న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిశోర్ ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ సీఐ రమేష్ కథనం మేరకు... గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిశోర్ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శివకేశవ్, రాగాల కృష్ణ చైతన్య, బచ్చు కిరణ్, పరస శివప్రసాద్తో కలిసి ఆన్లైన్ మోసాలకు పాల్పడేవారు. కేరళ, వెస్ట్బెంగాల్, ఒడిసా రాష్ర్టాల నుంచి సిమ్కార్డులతో పలువురికి ఫోన్చేసి బెట్టింగ్ ఆడేలా ప్రలోభాలకు గురిచేసేవారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన హర్షిత, వీ.కోటకు చెందిన మానస, బంగారుపాళ్యం మండలానికి చెందిన హేమలత ప్రలోభాలకు లోనై బెట్టింగ్ ఆడారు. హర్షిత రూ.87,560, మానస రూ.1,15,500, హేమాలత రూ.3.10 లక్షలు మోసపోయారు. వీరి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చీరాలకు చెందిన శివకేశవ్, రాగాల కృష్ణ చైతన్య, బచ్చు కిరణ్, పరస శివప్రసాద్ను గురువారం అరెస్టు చేశారు. వివిధ బ్యాంకులో ఏడు ఖాతాలను గుర్తించి వాటిలో ఉన్న రూ.5.13 లక్షలను ప్రీజ్ చేశారు. ట్రాన్సాక్షన్ను నిలుపుదల చేసి బెట్టింగ్లో మానస నష్టపోయిన రూ.61,500 వెనక్కు రప్పించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఫిలిప్పైన్స్లో ఉంటున్న ప్రధాన నిందితుడు నవకిశోర్ను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ రమేష్బాబు తెలిపారు.