బల్లితోక పడిన పాలు తాగి నలుగురికి అస్వస్థత

ABN , First Publish Date - 2021-03-07T06:15:55+05:30 IST

ఓ ప్రైవేట్‌ పాలడెయిరీ ప్యాకెట్‌లో బల్లిపడిన పాలను సేవించి నలుగురు కుటుంబసభ్యులు అస్వస్థతకు గురైన సంఘటన పలమనేరు మండలంలో శనివారం జరిగింది.

బల్లితోక పడిన పాలు తాగి నలుగురికి అస్వస్థత
పాల ప్యాకెట్‌లో బయటపడిన బల్లి తోక

పలమనేరు రూరల్‌,మార్చి 6 : ఓ ప్రైవేట్‌ పాలడెయిరీ ప్యాకెట్‌లో బల్లిపడిన పాలను సేవించి నలుగురు కుటుంబసభ్యులు అస్వస్థతకు గురైన సంఘటన పలమనేరు మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు... మొసలిమడుగు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ కుమారుడు వినయ్‌కుమార్‌ పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్‌ డెయిరీ పాలప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. శనివారం వేకువజామున  ఈశ్వరమ్మ ఆ పాలప్యాకెట్‌లో సగభాగం వేరుచేసి టీ పెట్టుకొని కుటుంబసభ్యులందరూ సేవించారు. కొద్దిసేపటికే ఒకే సారి నలుగురికీ వాంతులు మొదలయ్యాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న నలుగురు కుటుంబసభ్యులకు ఒకేసారి వాంతులు మొదలవడంతో అనుమానం వచ్చి పాలప్యాకెట్‌ను పరిశీలించగా, అందులో బల్లితోక బయటపడింది. దీంతో వెంటనే ఈశ్వరమ్మ, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశారు.  ప్రథమ చికిత్స అనంతరం వారి ఆరోగ్యం కుదుటపడడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. 


Updated Date - 2021-03-07T06:15:55+05:30 IST