మదనపల్లె వైద్య కళాశాలకు నేడు శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-05-31T05:28:56+05:30 IST
మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద నిర్మించనున్న మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈనెల 31న సోమవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.
![మదనపల్లె వైద్య కళాశాలకు నేడు శంకుస్థాపన](https://media.andhrajyothy.com/appimg/galleries/1921053011565055/05302021235803n80.gif)
హాజరు కానున్న మంత్రులు
మదనపల్లె టౌన్, మే 30: మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద నిర్మించనున్న మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈనెల 31న సోమవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్యవరం వద్ద 95.5 ఎకరాల్లో రూ.475 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాల నిర్మాణానికి సోమవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లె నుంచి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కాగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ మైదానంలో వేసిన టెంట్లలో వర్చువల్ శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం కలెక్టర్ హరినారాయణన్ శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఆడియో, వీడియో సంబంధించి కెమెరాలు, మైకులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా స్టాండ్బైగా మరో జనరేటర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే నవాజ్బాషా, సబ్కలెక్టర్ జాహ్నవితో శంకుస్థాపన, పలు అంశాలపై చర్చించారు. వీఐపీలు కూర్చునే స్టేజీ, వీడియో స్ర్కీన్, శిలాఫలకాలను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ధనుంజయరెడ్డి, డీఈ రమేష్ సహా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.