గుండెపోటుతో తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి మృతి
ABN , First Publish Date - 2021-07-08T06:30:57+05:30 IST
తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి (65) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన విజయసారథి 1982లో దివంగత తమిళ సీఎం ఎం.జీ.రామచంద్రన్ కేబినెట్లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.
సత్యవేడు, జూలై7: తమిళనాడు మాజీ మంత్రి విజయసారథి (65) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన విజయసారథి 1982లో దివంగత తమిళ సీఎం ఎం.జీ.రామచంద్రన్ కేబినెట్లో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎంజీఆర్ మరణానంతరం అక్కడి ద్రవిడ రాజకీయాల్లో ఇమడలేక సత్యవేడులోని రాంనగర్లో నివాసం ఏర్పరుచుకున్నారు. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలతకు రాజకీయ గురువుగా మారారు. హేమలత ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే వరకు రాజకీయాలలో ఉన్నత స్థానానికి ఎదగడంలో తెర వెనుక విజయసారథి పాత్ర ప్రముఖంగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసేందుకు టికెట్ రేసులో ఉన్నారని వార్తలు కూడా వెలువడ్డాయి. నియోజకవర్గంలో అన్ని పార్టీల నాయకులందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కాగా విజయసారథి అవివాహితులు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆయన నివాస గృహంలోఉదయం దినపత్రికలు చదువుతుండగా గుండె పోటు వచ్చింది. గమనించిన ఆయన అనుచరులు వెంటనే సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయసారథి మృతిపట్ల డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆదిమూలం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం తమిళనాడు అరక్కోణంలో జరగనున్నట్లు ఆయన అభిమానులు తెలిపారు.