అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-21T05:46:23+05:30 IST
సాగు చేసిన పంటలు ఏనుగులు ధ్వంసం చేయడం, ఉన్న మూడు పాడి ఆవులు మృత్యువాత పడడంతో చేసిన అప్పు తీర్చే దారి కనబక గంగవరం మండల కురప్పల్లెకు చెందిన రామ్మూర్తి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు
గంగవరం, జనవరి 20: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గంగవరం మండలంలోని కురప్పల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కురప్పల్లెకు చెందిన రామ్మూర్తిరెడ్డి(46), ఆయన కుటుంబీకులు తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు. వరి, మల్బరి సాగు దిగుబడి సయమంలో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. దీనికి తోడు మూడు పాడి ఆవులు మృతి చెందాయి. దీంతో రామ్మూర్తిరెడ్డి కుటుంబం ఆర్థికంగా దెబ్బతినింది. అంతేకాకుండా రూ.5 లక్షల అప్పు తీర్చే దారి కనబడక మంగళవారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.