గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం

ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన గరుడ యాప్‌పై విస్త్రత ప్రచారం కల్పిస్తామని డీఆర్వో ఎంఎస్‌ మురళి అన్నారు.

గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన గరుడ యాప్‌పై విస్త్రత ప్రచారం కల్పిస్తామని డీఆర్వో ఎంఎస్‌ మురళి అన్నారు. శుక్రవారం విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఆర్వో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు కోసం గరుడ యాప్‌ను వినియోగించేలా అవగాహన కల్పిస్తామన్నారు. దరఖాస్తుదారులు ఎన్‌రోల్‌మెంట్‌ ఫారం పూర్తిచేసి అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆ దరఖాస్తులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వస్తాయన్నారు. అనంతరం సంబంధిత బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అప్‌లోడ్‌ చేస్తే ఓటరు జాబితాలో పేరు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు దరఖాస్తుదారు ఇంటి వివరాలను జియో ట్యాగింగ్‌ ద్వారా తెలుసుకునేందుకు గరుడ యాప్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ చంద్రశేఖర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాజశేఖరనాయుడు, ఆర్డీవో రేణుక, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST