కౌండిన్యలో ఏనుగు మందల తిష్ట
ABN , First Publish Date - 2021-06-04T04:43:16+05:30 IST
పలమనేరు మండలంలోని మొసలిమడుగు, కాలోపల్లె, మండిపేటకోటూరు, నూనేవారిపల్లె, మండిపేటకోటూరు, కృష్ణాపురం తదితర గ్రామాలు కౌండిన్య అభయారణ్యానికి అతిదగ్గరలో ఉండడంతో ప్రజలు నిత్యం ఏనుగుల ఘీంకారాలతో హడలిపోతున్నారు.
పిల్లలు ఉండడంతో సరిహద్దులు దాటని వైనం
పలమనేరు రూరల్, జూన్3 : పలమనేరు మండలంలోని మొసలిమడుగు, కాలోపల్లె, మండిపేటకోటూరు, నూనేవారిపల్లె, మండిపేటకోటూరు, కృష్ణాపురం తదితర గ్రామాలు కౌండిన్య అభయారణ్యానికి అతిదగ్గరలో ఉండడంతో ప్రజలు నిత్యం ఏనుగుల ఘీంకారాలతో హడలిపోతున్నారు. లాక్డౌన్తో రోడ్లన్నీ బోసిపోయి వాహన రాకపోకల శబ్దాలు పూర్తిగా ఆగిపోవడంతో ఏనుగులు రోడ్లపైకి వస్తున్నాయి.
తమిళనాడు వైపు వెళ్లలేకపోతున్న ఏనుగులు
తమిళనాడు ప్రాంతాల్లో చాలావరకు అడవికి నిప్పంటించడంతోపాటు అక్కడి ఏనుగుల రైడింగ్ చాలా క్రూరంగా ఉండడంతో తమిళనాడు సరిహద్దుల వైపు వెళ్లడానికి జంకుతున్నాయి. దీనికితోడు మన కౌండిన్య అభయారణ్యంలో దట్టమైన పచ్చని చెట్లు ఉండడంతో ఏనుగుల గుంపులు తమకు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి.
కౌండిన్యలో 50 ఏనుగులపైగా తిష్ట
ప్రస్తుతం కౌండిన్య అభయారణ్యంలో సుమారు 50 ఏనుగులకు పైగా తిష్టవేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి గుంపులుగా విడిపోయి అటవీ సరిహద్దు ప్రాంత పొలాలు, మామిడి తోటలను ఆరగించి, తొక్కి నాశనం చేస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏనుగుల గుంపుల్లో ఉన్న 9 ఏనుగులుపైగా ప్రసవించడంతో ముందుకు సాగలేకపోతున్నాయి. గురువారం మొసలమడుగు సమీపంలో దర్గావద్ద ఏనుగుల గుంపులు వెళ్తుండగా, ఆదే గ్రామానికి చెందిన యువకులు సెల్ఫోన్లో బందిస్తుండగా, వెనుక మరో పిల్లఏనుగుల మంద తరుముకొంది. దీంతో యువకులు పరుగులు తీశారు.