కలంకారీ రత్నం ఇకలేరు

ABN , First Publish Date - 2021-02-15T05:38:58+05:30 IST

శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ కలంకారీ కళాకారుడు గుర్రప్పశెట్టి ఆదివారం కన్నుమూశారు.

కలంకారీ రత్నం ఇకలేరు
మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న గుర్రప్పశెట్టి

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 14: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కలంకారీ రత్నం జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి(84) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తి పట్టణం చెన్నైరోడ్డు ప్రాంతంలో ఉన్న తన స్వగృహంలో మృతిచెందారు. కాగా, 1937, మార్చి 15న అమ్మణ్ణమ్మ, లక్ష్మయ్య దంపతులకు గుర్రప్ప జన్మించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న ఆయన కలంకారీ కళపై మక్కువ పెంచుకున్నారు. ఆ కళలో ప్రావీణ్యం సంపాదించి తన ప్రతిభతో శ్రీకాళహస్తికి జాతీయస్థాయి గుర్తింపు కూడా తెచ్చారు. కలంకారీ పుట్టు పూర్వోత్తరాలు, విభిన్నశైలులు, 64 కళలను వస్త్రాలపై ప్రతిబింబించే అద్భుత కళ గురించి ఆయన ఓ పుస్తకాన్నీ రచించారు. తన ప్రతిభకు 1976లో జాతీయస్థాయి అవార్డు పొందిన ఆయన్ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కళాతోరణం అవార్డుతోనూ సత్కరించింది. 2001లో మధఽ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తులసి బిరుదునూ పొందారు. 2002లో కేంద్ర ప్రభుత్వం శిల్పగురు అవార్డు, 2008లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా ప్రత్యేక పురస్కారాన్నీ అందుకున్నారు. అదే ఏడాది ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా గుర్రప్పశెట్టి అందుకున్నారు. కళంకారీ కళలో ఆయన చేసిన ప్రయోగాలకు ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అయితే ఎంత ఎదిగినా సామాన్య వ్యక్తిలాగే అందరితో కలసి పోయేతత్వం ఆయనదని ప్రముఖులు కొనియాడుతుంటారు. 



Updated Date - 2021-02-15T05:38:58+05:30 IST