నేనున్నా.. కేసులకు భయపడకండి
ABN , First Publish Date - 2021-11-01T04:54:18+05:30 IST
వైసీపీ నేతలు ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా, అనవసరంగా కేసులు పెట్టినా భయపడకండి.
![నేనున్నా.. కేసులకు భయపడకండి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921103111220734/10312021232235n37.jpg)
మున్సిపల్ ఎన్నికల్లో అందరూ గెలవాలి
నాయకులు, అభ్యర్థులు, వార్డుఇన్చార్జులకు చంద్రబాబు దిశానిర్దేశం
కుప్పం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం
కుప్పం రూరల్, అక్టోబరు 31: ‘వైసీపీ నేతలు ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా, అనవసరంగా కేసులు పెట్టినా భయపడకండి. నేను అన్నీ చూసుకుంటా’ అని అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులు సాగిన చంద్రబాబు పర్యటన టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపింది. శనివారం అర్ధరాత్రి దాటాక (ఆదివారం వేకువజామున) 2 గంటల వరకు రోడ్షోలో పాల్గొన్నారు. 3 గంటలకు మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జులతో సమీక్షించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గెలవాలని సూచించారు. అనంతరం బస్సులోనే బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి రోడ్డుమార్గాన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. ఈయన వెంట మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, చంద్రబాబు పీఏ మనోహర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ తదితరులున్నారు.