ఐదు రోజుల పాటు పింఛన్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-31T05:41:54+05:30 IST

వైఎస్సార్‌ పింఛను కానుక పథకంలోని పింఛనుదారులకు ప్రభుత్వం రూ.250 పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జిల్లాకు అందాయి.

ఐదు రోజుల పాటు పింఛన్ల పంపిణీ

-రోజుకో మండలంలో  ఎమ్మెల్యేలతో కార్యక్రమాలు

చిత్తూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ పింఛను కానుక పథకంలోని పింఛనుదారులకు ప్రభుత్వం రూ.250 పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జిల్లాకు అందాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీటీసీ, ఎంపీపీ వంటి ప్రజాప్రతినిధులతో ఐదు రోజుల పాటు రోజుకో మండలంలో అధికారికంగా పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లకు, ఎంపీడీవోలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. వీరంతా ప్రజాప్రతినిధులతో  సమన్వయం చేసుకుని పింఛన్లను పంపిణీ చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛనుదారుల వయస్సును 65 నుంచి 60కి తగ్గించిన విషయాన్ని, ఎన్నికల హామీలో భాగంగా పింఛను సొమ్ము పెంచుతున్న విషయాన్ని  ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ ఆదేశాలు అందినట్లు సమాచారం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, గీత కార్మికులు వంటి వారంతా జిల్లాలో 439948 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 2250 పింఛను అందుతుండగా జనవరి 1 నుంచి రూ.2500 అందనుంది.

Updated Date - 2021-12-31T05:41:54+05:30 IST