పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన
ABN , First Publish Date - 2021-07-14T21:28:03+05:30 IST
పెట్రోల్, డీజీల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ చిత్తూరులో కాంగ్రెస్ నాయకులు..
చిత్తూరు జిల్లా: పెట్రోల్, డీజీల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ చిత్తూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు సైకిల్పై ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ దగ్గర వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా తులసీరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రస్తుతం వాహనాలు వాడాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మహిళలు వంటగదిలోకి వెళ్లాలంటే వణికిపోతున్నారని.. దీనికి కారణం.. పెట్రోల్ ధర సెంచరీ దాటిందని, వంట గ్యాస్ ధర కూడా సెంచరీకి సమీపంలో ఉందన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని జగన్.. ఈ రెండు ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయన్నారు. దీనికి నిరసనగా సోనియా గాంధీ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు నగరంలో ధర్నా కార్యక్రమం చేపట్టామని తులసీరెడ్డి స్పష్టం చేశారు.